E-Paper
Advertisement

Kummara Protest: ఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల పోరాటం.. డిండి రహదారిపై భారీ ఆందోళన!

Kummara Protest: ఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల పోరాటం.. డిండి రహదారిపై భారీ ఆందోళన!
Advertisement

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం లత్తిపూర్ గ్రామంలోని శ్రీ కట్ట మైసమ్మ దేవస్థానంలో పూజారులుగా కొనసాగుతున్న కుమ్మర్ల హక్కులను పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కుమ్మర్లను పక్కనపెట్టి ఇతరులను పూజారులుగా నియమించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని సంఘ నాయకులు     డిమాండ్ చేశారు. ఈ మేరకు  పెద్ద సంఖ్యలో కుమ్మర్లు ఆలయం దగ్గర నిరసన దీక్ష చేపట్టి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

డిండి ప్రాజెక్టు సమీపంలోని భారీ నిరసన

డిండి ప్రాజెక్టును ఆనుకుని ఉన్న కట్ట మైసమ్మ తల్లి ఆలయంలో దశాబ్దాలుగా పూజారులుగా కొనసాగుతున్న కుమ్మర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నాయకులు, స్థానిక కుమ్మరి కుటుంబాలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిరసన దీక్ష చేపట్టారు. తరువాత ఆలయం ముందు ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో కొంతసేపు డిండి మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

1947 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం

ఈ సందర్భంగా మాట్లాడిన ఏడుకొండల వెంకటేశం, కట్ట మైసమ్మ ఆలయంలో 1947 సంవత్సరం నుంచి కుమ్మరి వర్గానికి చెందిన కుటుంబాలే పూజారులుగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం నుంచి అభివృద్ధి వరకు ప్రతి దశలో కుమ్మర్ల పాత్ర కీలకమైందని చెప్పారు. కేవలం పూజలు నిర్వహించడం మాత్రమే కాకుండా, ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేక ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి సేవను తరతరాలుగా కొనసాగిస్తున్న కుటుంబాలను ఇప్పుడు ఆలయానికి దూరం చేయాలని ప్రయత్నించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎండోమెంట్స్ పరిధిలోకి వచ్చిన తర్వాత వివాదం

Advertisement

ఇటీవల ఆలయం ఎండోమెంట్స్ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని  వెంకటేశం  ఆరోపించారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం కుమ్మర్లను పూజారి బాధ్యతల నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆలయానికి సంబంధించిన సంప్రదాయ హక్కులను కాలరాసే విధంగా చర్యలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం, ఎండోమెంట్స్ శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామదేవత ఆలయాల్లో తరతరాలుగా పూజారులుగా సేవలందిస్తున్న కుమ్మర్ల హక్కులను చట్టపరంగా రక్షించాలని డిమాండ్ చేశారు.

గ్రామదేవత ఆలయాల్లో కుమ్మర్లకే అవకాశం కల్పించాలి

రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామదేవత ఆలయాల్లో కుమ్మర్లు పూజారులుగా కొనసాగుతున్నారని సంఘ నాయకులు వెంకటేశం గుర్తు చేశారు. పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అవసరమన్నారు. కుమ్మర్ల వతన్ ఉన్న గ్రామ దేవత ఆలయాల్లో వారికి పూజారులుగా కొనసాగే అవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే హామీతో ముగిసిన ఆందోళన

డిండి కట్ట మైసమ్మ తల్లి ఆలయ వివాదానికి సంబంధించి నిరసన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమస్యపై స్పందించినట్లు ఏడుకొండల వెంకటేశం తెలిపారు. కుమ్మరి సంఘం నాయకులతో మాట్లాడిన ఎమ్మెల్యే, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, సంప్రదాయ పూజారుల హక్కులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే సానుకూల స్పందనతో పాటు అధికారులు కూడా చర్చలకు సిద్ధమవడంతో నిరసన దీక్షను విరమించినట్లు వెల్లడించారు.

భారీగా పాల్గొన్న కుమ్మరి సంఘం నాయకులు

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడ జయంత్ రావు, రాష్ట్ర సలహాదారు రాంచంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి నాగపూరి నగేష్, సహాయ కార్యదర్శి జిల్లాల శంకరయ్య, ప్రచార కార్యదర్శులు అగిరిశెట్టి వీరన్న, నిమ్మలూరి శ్రీనివాస్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

అలాగే మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన సంఘ నాయకులు, మహిళలు, ఆలయ పూజారులు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సుమారు 600 మంది కుమ్మరి సామాజిక వర్గ సభ్యులు హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. కుమ్మర్ల సంప్రదాయ హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని సంఘ నాయకులు స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×