సర్కార్ను నిలదీస్తే తప్ప నిధులు రాలేదు. బాహాటంగా విమర్శిస్తే తప్ప పనులు కాలేదు. ఇదేం సర్కార్ వ్యా! ఎంతో మంది సీఎంలను జూసినా? నేను ఫోన్ చేస్తే పట్టించుకోరా! అసలు సర్కార్ ఉన్నదా !? ఇట్ల ఒక్క మాటకాదు.. చాలానే అన్నాడు. మరి సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి, మాజీ స్పీకరు.. ! కేసీఆర్ పాలనలో అన్నీ నడిపించుకున్నాడు. చెప్పింది చెప్పినట్టు పనులు అయ్యాయి. కొంచెం లేటైనా!
ఇక్కడ మాత్రం ఆ పెద్దాయనను పట్టించుకున్నోళ్లే లేరు. అసలు తను పార్టీ మారిందే.. ఇట్లా నిధులు రప్పించుకుని.. పనులు చేపించుకునేందుకేనాయే! మరి ఆ నిధులే రాకపోతే నేనొచ్చి ఫాయిదా ఏంది వ్యా! అని బాహాటంగానే బజార్ల కూర్చేసుకుని మరీ అడిగేసిండు. మరెన్ని రోజులని ఓపిక పట్టుమంటువు? పెద్దాయన. ముందే కొంచెం ఓపిక తక్కువ. వయస్సు మీద పడ్డది. దీనికి తోడు.. కేటీఆర్ కావాలని బాన్సువాడ రావాలె.. తుక్కుతుక్కు తిట్టిపోవాలె. ఇన్ని చేసినం నీకు.. ఇంకేంజేయాల్నే పెద్దమనిషి.. ఏదన్న బండగట్టుకుని బాయిల దుంకి చావరాదు..!? అని రిపీటెడ్గా ఇవే తిట్లు తిడుతున్నాడు. పార్టీ మారినందుకు. అన్నీ భరించిండు. కానీ రేవంత్ సర్కార్ తనను పట్టించుకోవడం మాత్రం భరించలేకపోయాడు. కులం చెడ్డా సుఖం దక్కాలంటారు. ఈడ కులం చెడిపోయింది.. కానీ సుఖమే దక్కలేదనే బాధ ఆయనను వేధించింది.
అందుకే ఓ ఫైన్ మార్నింగ్ ఆ సిద్దాపూర్ రిజార్వాయర్ పనులు ఆగిపోయిన కాడ కూర్చేసుకుని కూర్చున్నడు. నేను ఫోన్ చేస్తే పొన్నం ఫోన్ లేపడా.. ? ఆ వేం నరేందర్రెడ్డి ఏమనుకుంటున్నడు? అసలు సీఎం రేవంత్ నా గురించి ఏమనుకుంటున్నడు! ఇట్ల మొత్తం సర్కార్నే నిలదీశాడు. మరి పనులు ఆగిపాయె. కాంట్రాక్టర్లు లబోదిబో అంటుండ్రు. అటు సర్కార్లో గౌరవం లేకపాయె.. ఇటు నిధులు రాకపాయె. పేరుకు.. మాత్రం తనో ప్రభుత్వ సలహాదారు.. అదీ వ్యవసాయ శాఖకు. ఏనాడైనా సీఎం పిలిచి మాట్లాడిండా? పక్కన కూసోబెట్టుకున్నడా? అదే కేసీఆర్ అయితే.. లక్ష్మీ పుత్రుడు అని ఆప్యాయంగా పిలిచేవాడు. రేవంత్రెడ్డి ఉలుకు లేదు పలుకు లేదు. గిదేం మర్యాద వయా! అని తిక్కరేగినట్టుంది పోచారం శ్రీనివాస్రెడ్డికి.
అందుకే అట్ల అర్సుకున్నడో లేదో.. ఇగో ఇవాళ మంత్రి ఉత్తమ్ రానే వచ్చిండు. నిధులు ఇస్తానని మాటిచ్చిండు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 250 కోట్లు. ఇగ చాలు పో.. ఈ టర్ముకు అనుకుని ఉంటాడు పోచారం సాబ్! మరి ఇవి కూడా ఇస్తరో ఇయ్యరో.. అని బాగానే డౌట్ వడ్డడు. ఎందుకంటే తిట్టిండు కదా! కానీ అవన్నీ ఏం పట్టించుకోలేనట్టుంది సర్కార్. ఇగ పోనీ పెద్దాయన అవస్థ పడుతుండు.. ఏదో నాలుగు రాళ్లు.. అదే… నాలుగు పనులు చేసుకోని అని ఇట్లా స్పందించి ఉంటరు. మొత్తానికి మా పోచారం అనుకున్నది సాధించాడు అని సంబరపడిపోతున్నరంట ఆ బాన్సువాడ నియోజకవర్గం కార్యకర్తలు.
మరి లీడర్ అంటే ఇట్లుండాలె! అని కూడా అనుకుంటున్నారట. కానీ అంతా ఇట్లనే బయటకొచ్చి లొల్లి చేస్తే పైసలెక్కడ్నుంచి తేవాలె! ఇప్పటికే పరేషాన్ బడ్జెట్ నడుస్తున్నది. మొన్ననే భట్టి గారు చెప్పనే చెప్పారు..కష్టకాలం ఉంది… కరువు కాలం ఉందని. మరి మిగిలిన లీడర్లు పోచారంను ఫాలో అయ్యేరు! పరిస్తితి చూసి నడుచుకోండ్రి..! లేకపోతే మొదటికే మోసం రావొచ్చు సుమీ! అని కూడా చర్చించుకుంటున్నారు.