Bhogapuram Airport: ఐదు రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి దాదాపు అన్ని పనులు పూర్తి అయ్యాయి. కాకపోతే కొన్ని పనులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలు ఆగష్టు 17 నుంచి ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ చీఫ్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచనప్రాయంగా చెప్పారు.
భోగాపురం ఎయిర్పోర్టు అంతా రెడీ- ఆగష్టు ఒకటిన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించేందుకు గ్రాండ్గా సన్నాహాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది. కాకపోతే ఎయిర్పోర్టు పరిసరాల పనులు కొద్దిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఎయిర్పోర్టుకు వచ్చే రహదారుల పనులు జరుగుతున్నట్లు సమాచారం.
ఆగష్టు 17 నుంచి రాకపోకలు- ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలు ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు సూచనప్రాయంగా చెప్పారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి పనులకు సంబంధించి విశాఖ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలు- ప్రధాని పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి దాదాపు 2 లక్షల మంది రావచ్చని అంచనా వేశారు. ఎయిర్పోర్టు ప్రారంభమైతే ప్రాంతీయ అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి పెరుగుతోందన్నారు. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విమానాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
జోరుగా రహదారుల పనులు- ప్రయాణికుల రాకపోకలు మొదలైతే వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా మారుతుందని చెబుతున్నారు. మరోవైపు జిల్లాల నుంచి ఎయిర్పోర్టుకు రావాల్సిన రహదారుల పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 17 లోపు ఆయా పనులు పూర్తికావచ్చని చెబుతున్నారు. అప్పటి నుంచి రాకపోకలు కంటిన్యూ అవుతాయని అంటున్నారు.
భోగాపురం ఎయిర్పోర్టు నుంచి దేశంలోని మెట్రోపాలిటిన్ సిటీలకు కాకుండా సింగపూర్, అబుదాబికి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చాలామంది హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రైన్ జర్నీ లాంగ్ కావడంతో వారంతా విమానంలో ట్రావెల్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ALSO READ: ఎవరికి తలవంచం.. ఎవరి ఫేవర్ తీసుకోం: ‘బిగ్ టీవీ’ గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్రెడ్డి
ఇదిలా వుండగా అనకాపల్లి జిల్లా నుంచి రోజూ 200 మంది విమానాల్లో ట్రావెల్ చేస్తున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఎయిర్ పోర్టు ప్రారంభంకాగానే మూడు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడపాలని భావిస్తోంది. వాటిలో అనకాపల్లి, అచ్యుతాపురం ఎస్ఈజడ్, ఎలమంచిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఎలక్ట్రిక్ బస్సులు నడపనుంది.
ఇప్పటికే 100 బస్సులను కేటాయించినట్టు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అందులో మూడు బస్సులను అనకాపల్లి జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాలు పెరుగుతాయని ఏపీ ట్రావెల్స్ అసోసియేషన్ చెబుతోంది.