Food Safety: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఖచ్చితంగా నాణ్యత పాటించాల్సిందేనని, తప్పకుండా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాల్సిందేనని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెండర్స్ కు అధికారులు సూచించారు. నగరంలో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో వెండర్స్ నాణ్యమైన ఆహారాన్ని అందించేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు ఫుడ్ సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెండర్స్ కు పరిశుభ్రత, ఆహార భద్రతపై కీలక సూచనలు చేశారు.
ఫుడ్ సేఫ్టీ వింగ్, నెస్లే ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో నగరంలోని రెండు వందల మంది ఫుడ్ వెండర్స్ పాల్గొన్నారు. ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అధికారులు వివరించారు. ఫుడ్ తయారీ నుంచి సర్వింగ్ వరకు ప్రతి దశలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుడ్ హ్యాండ్లింగ్ సమయంలో హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ క్యాప్స్, ఏప్రాన్ లు తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచించారు. ఆహారం తయారుచేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండటంతో పాటు వంట సామగ్రి కూడా శుభ్రంగా, నాణ్యత కలిగి ఉండాలని సూచించారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడరాదని, కస్టమర్లకు సేఫ్ ఫుడ్ అందించడమే ప్రధాన బాధ్యతగా భావించాలని వెండర్స్ కు అవగాహన కల్పించారు.
Also read: కేరళం చుట్టూ కొత్త రాజకీయాలు.. కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం, ఏం జరుగుతోంది?
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మూర్తి రాజు మాట్లాడుతూ ఫుడ్ కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ట్రైనింగ్ లో వివరించినట్లు తెలిపారు. కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యతలేని పదార్థాలు, ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని హెచ్చరించినట్లు ఆయన వివరించారు. నిల్వ చేసే పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచాలని, తాగునీరు, ఐస్, ఆయిల్ వంటి వాటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించినట్లు మూర్తి రాజు తెలిపారు. ట్రైనింగ్ పూర్తి చేసిన స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు అధికారులు సేఫ్టీ కిట్స్ తో పాటు సర్టిఫికెట్లు అందజేసినట్లు వివరించారు. భవిష్యత్తులో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంలో ప్రతి ఫుడ్ వెండర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించామని ఆయన పేర్కొన్నారు.
Also read: రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!