Visakhapatnam: విశాఖపట్నంలోని శ్రీనగర్లో ఒక చిన్న బిర్యానీ గొడవ చివరకు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం (33), ప్రియాంక (30) దంపతులకు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఇటీవల బలరాం మద్యం తాగడానికి బయటకు వెళ్లి, భార్యకు ఫోన్ చేసి బిర్యానీ ఆర్డర్ చేసి ఉంచమని చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఫోన్లోనే చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక, ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బలరాం, భార్య మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తీవ్ర భయాందోళనతో ఏం చేయాలో తోచక, తన నాలుగేళ్ల కన్న కొడుకు కళ్లెదుటే అదే ఫ్యాన్కు ఉరేసుకుని తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళ్లముందే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ చిన్నారి ఒంటరివాడయ్యాడు. చిన్న గొడవ ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.
Also Read: 3 గంటల ప్రయాణం ఇక 20 నిమిషాల్లోనే.. చైనా, పాక్లకు మైండ్ బ్లాంక్!