Journalist Accreditations: తెలంగాణలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. గురువారం సమాచార శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. గత ప్రభుత్వం 32,500 మందికి అక్రిడిటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా 23,352 కే పరిమితం చేసిందని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేషన్లు ఇచ్చేలా మార్పులు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే సుమారు 2800 వరకు కార్డులను ఆమోదించడం జరిగిందని వివరించారు. జర్నలిస్టుల సూచనల మేరకు జీవోలలో మార్పులు చేర్పులు చేశామని, అర్హులైన జర్నలిస్టులకు కార్డుల మంజూరులో వెనకడుగు ప్రసక్తే లేదని అన్నారు. మే 1వ తేదీన అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
ఈ ప్రక్రియలో మే 10వ తేదీని ఒక కటాఫ్ డేట్గా పెట్టుకొని దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్లు సంఖ్య తేలితే జర్నలిస్టులకు ఆరోగ్యం ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చునని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా పలు సూచనలు చేశారని వెల్లడించారు.
అంతేగాక జర్నలిస్టులు వివిధ సంస్దలలో ఉద్యోగాలు మారినప్పటికీ అక్రిడిటేషన్ల మంజూరు ఓ నిరంతర ప్రక్రియగా సాగుతుందని ఈ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని, త్వరలో పాత్రికేయ సంఘాలతో భేటీ అవుతామని తెలిపారు. ఏప్రిల్ 30తో కొంతమంది జర్నలిస్టుల బస్సుపాస్ల గడువు ముగుస్తున్నందున మరో 15 రోజుల పాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
Also Read: సీఎంఆర్ కాలేజీలో ఫార్మా విద్యార్థుల ఆందోళన.. గాంధీ హాస్పిటల్ ఒప్పందం రద్దు..!