E-Paper
Advertisement

Harish Rao : ఇక.. బీఆర్ఎస్‌లో నంబరు 2 హరీషేనా?!

Harish Rao : ఇక.. బీఆర్ఎస్‌లో నంబరు 2 హరీషేనా?!
Advertisement
latest political news telangana

Harish Rao Political news : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాగిన దానికి భిన్నంగా కొత్త అసెంబ్లీ పనిచేయటం మీద మేధావులు, తెలంగాణ వాదులు సంతోషం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టులు, బడ్జెట్ అంశాల మీద ప్రధానంగా చర్చ నడిచింది. అటు అధికార కాంగ్రెస్‌, ఇటు విపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య గరంగరంగా నడిచిన ఈ చర్చలో అధికార పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి, గులాబీ పార్టీ తరపున హరీష్ రావు మధ్య ప్రధానంగా మాటల యుద్ధం సాగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, అవినీతి మీద సాగిన చర్చ ద్వారా రేవంత్ టీం దూకుడుగా వ్యవహరించి పైచేయి సాధించింది.

రాజకీయ లబ్ది కోసం ఏపీం సీఎం జగన్‌తో కేసీఆర్ లోపాయకారీ ఒప్పందం చేసుకుని తెలంగాణ జలాలను ఏపీకి తరలించేందుకు సాయపడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు అప్పగించటం మీద కూడా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. తాను చేసిన అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌ని కాంగ్రెస్ స‌భ్యులు అన్నారు.

Advertisement

అయితే, ఇంత జరుగుతున్నా.. విపక్ష బీఆర్ఎస్ తరపున హరీష్ తప్ప ఎవరూ నోరు తెరవలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక, నీటి పారుదల మంత్రిగా ఉన్న హరీష్ రావు మాత్రమే ప్రభుత్వం విమర్శలకు జవాబిస్తూ వచ్చారు. కానీ.. నాటి ప్రభుత్వంలో సూడో సీఎంగా చెలామణి అయిన కేటీఆర్ మాత్రం వెనక బెంచీలకే పరిమితమై మౌనం దాల్చటం గులాబీ శ్రేణులను కలవరపరుస్తోంది.

Read more: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదే..

Advertisement

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ త‌రువాత ఆయ‌న త‌న‌యుడు కేటీఆరే బాధ్యతలు చేపడతారని, మూడోసారి గెలిస్తే ఆయనే సీఎం అవుతారని ఇన్నాళ్లుగా చెప్పుకొచ్చిన గులాబీ నేతలకు, కేటీఆర్ అభిమానులకు ఇది మింగుడు పడని పరిణామంగా మారింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తన తండ్రి బాధ్యతను తీసుకోవాల్సిన కేటీఆర్.. అసెంబ్లీలో గొంతు విప్పకపోవటం వెనక కారణమేంటోనని వారు ఆందోళన చెందుతున్నారు. మాజీ నీటి పారుదల శాఖా మంత్రిగా ప్రాజెక్టుల మీద హరీష్ దీటుగా మాట్లాడుతున్నప్పటికీ.. మంత్రి వర్గానికి ఉమ్మడి బాధ్యత ఉంటుంది గనుక చర్చలో జోక్యం చేసుకుని, పార్టీ విధానాన్ని, నాటి ప్రభుత్వ నిర్ణయాల్లోని సహేతుకతను చెప్పాల్సిన కీలక సమయంలో రిలాక్స్ కావటం మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఇప్పటికే ట్విట్టర్ టిల్లూగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోన్న కేటీఆర్ తాజా వైఖరి కారణంగా.. తమ నేతకు ఇరిగేషన్ తదితర అంశాల్లో పెద్ద అవగాహన లేదనే మెసేజ్ జనంలోకి పోతుందని అటు ఆయన అభిమానులూ ఆందోళన చెందుతున్నారు. సభలోని సభ్యులకు మార్గదర్శిగా ఉంటూ అన్నీ తానై వ్యవహరించాల్సిన కేటీఆర్ ఆ బాధ్యతను తీసుకోకపోతే.. పార్టీలో ఆ స్థానం హరీష్ రావుకు దక్కే ప్రమాదముందని వారు లోలోన చర్చించుకుంటున్నారు.

దీనికి తోడు ప్రాజెక్టుల మీద అసెంబ్లీలో ప్రభుత్వాన్ని హరీష్ రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేయటం మీద కూడా సదరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే.. ఇన్నాళ్లూ తాము నమ్మి, వెంటనడిచిన కేటీఆర్ ఇక రెండో స్థానాన్ని వదిలేయాల్సిందేనని, పార్టీలో ఇకపై కేసీఆర్ తర్వాత అన్నీ హరీష్ రావే నడిపిస్తారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల హరీష్ రావు నోరుజారి రేవంత్‌ రెడ్డి తప్పుకుంటే సీఎంగా ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉన్నానని మనసులో చిరకాల కోరికని బయటపెట్టేసుకున్నారు. కానీ.. ఆ మాటను వెనక్కి తీసుకోకపోయినా.. కేసీఆర్, కేటీఆర్ అసలు ఆ మాటే తాము వినలేదనట్లుగా మౌనంగా ఉండిపోవటం మీదా పార్టీ సీనియర్లలో చర్చ జరుగుతోంది.

చివరిగా.. ఇక రాబోయే రోజుల్లోనైనా కేటీఆర్ వైఖరి మార్చుకొని, దూకుడుగా ముందుకు సాగకపోతే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే వస్తాయని, అదే జరిగితే.. కాంగ్రెస్ తమ పార్టీని నిర్వీర్యం చేయకుండా ఊరుకోదని వారు కంగారు పడుతున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×