కేసీఆర్ ఇక తరుచూ బయటకు రానున్నారు. గతంలో ఎప్పుడో ఒకసారి గానీ ఆయన బయటకు వచ్చేవారు కాదు. అసెంబ్లీ ఛాయలకు కూడా రావడం లేదు. దీనిపై ఎవరెన్ని చెప్పినా.. ఎంత మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది. జీవన్రెడ్డి చేరికతో ఆయన తన రూటు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. జగిత్యాల బహిరంగ సభ తరువాత పార్టీకి మంచి ఊపొచ్చిందనే చెప్పాలి. లేక లేక తమ అధినేత బయటకు వచ్చి నైరాశ్యంలో ఉన్న బీఆరెస్ శ్రేణులను పలకరించినట్లైందని సంబరపడ్డారు. ఇకపై ఆయన బయటకు రావడమే మేలని నిర్ణయానికి వచ్చారంతా.
ప్రధానంగా కేటీఆర్ .. ఈ విషయంలో కేసీఆర్ను ఇలా బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఎప్పటికప్పుడు పార్టీని జనాల్లో బలోపేతం చేసే విధంగా ఉంచడంతో పాటు.. పార్టీ క్యాడర్లో కూడా ఉత్సాహం నింపినట్లైవుతుందని భావించారు. ఈ నెల 6న వరంగల్లో రైతు సభకు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ దీనికి హాజరవుతున్నట్టు పార్టీ ఇది వరకే ప్రకటించింది. తరుచు ఆయన తెలంగాణ భవన్లో మీటింగులకు, బహిరంగ సభలకు హాజరుకావడం వల్ల అటు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడంతో.. పార్టీకి, కార్యకర్తలకు బూస్టింగ్ ఇచ్చినట్టవుతుందని భావిస్తున్నారు.
ప్రధానంగా ఈ విషయంలో కేటీఆర్ చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ ఎన్ని మీటింగులు పెట్టినా.. ఎంత దూకుడుగా మాట్లాడినా.. జనం నుంచిపెద్దగా రెస్పాన్స్ రావడం లేదనే ఫీడ్ బ్యాక్ ఉంది. కేసీఆర్పైనే జనాలకు ఇంకా నమ్మకం ఉంది. ఆయన వచ్చి మాట్లాడుతుంటేనే వారు స్పందిస్తున్నట్టుగా సీనియర్లు కూడా గుర్తిస్తున్నారు. దీంతో ఆయన ఎన్ని రోజులు ఫామ్హౌజ్కు పరిమితమైతే.. అంత తమకే నష్టమని భావిస్తున్నారు. మరో వైపు అధికార పార్టీ పదే పదే ఫామ్హౌజ్ సీఎం అని విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అసెంబ్లీకి రావడం లేదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా జనాల్లోకి తీసుకుపోగలుగుతున్నది. ఇది పార్టీకి, కేసీఆర్కు కూడా ఇబ్బందికరంగానే ఉంది.
కానీ ఆయన బహిరంగ సభలకు, తెలంగాణ భవన్లో మీటింగులకు హాజరయ్యేలా ఉన్నారే తప్ప.. అసెంబ్లీకి మాత్రం రానంటే రాననే విధంగానే కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఆయన మెంటాలిటీని గుర్తెరిగిన సీనియర్లు, కేటీఆర్ కూడా కేసీఆర్ను అసెంబ్లీకి కచ్చితంగా రావాల్సిందేనని ఒత్తిడి చేయడం లేదు. అసెంబ్లీలో వార్ వన్సైడ్లా ప్రతిపక్షాన్ని అధికార పక్షం నిందిస్తుందనే భావనలో బీఆరెస్ ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ టార్గెట్గా ప్రసంగాలుంటాయని, అవి వినుకుంటూ ఓపిగ్గా హాలులో కూర్చోవడం కేసీఆర్ వల్ల కాదు.
సభను వాకౌట్ చేయడమో.. ఏదో ఒకటి జరుగుతుంది. ఇంతోటి దానికి కేసీఆర్ సభకు వచ్చి అవమాన పడి పోవడం ఎందుకు? అదేదో మేమే చూసుకుంటామనే విధంగా కేటీఆర్ ఆలోచన ఉంది. కానీ జనం ముందుకు, మీడియా ముందుకు ఆయన ఇకపై తరుచుగా రావడం మాత్రం పక్కా అనిపిస్తున్నది. ఇకపై ఫామ్హౌజ్ కేసీఆర్ అనే విమర్శకు తావు లేకుండా.. ఆయన పబ్లిక్ బాట పట్టనున్నారు. పబ్లిక్ మీటింగుల్లో తరచూ పాల్గొననున్నారు.